Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad500003
Railway stocks: దుమ్మురేపుతోన్న రైల్వే స్టాక్స్.. టికెట్ ఛార్జీల పెంపుతో.. 5 రోజుల్లో 26శాతం లాభాలు....
BBhoomi
Dec 29, 2025 04:49:28
Secunderabad, Telangana

Railway stocks: గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో రైల్వే రంగానికి చెందిన స్టాక్స్ స్టాక్ మార్కెట్‌ను షేక్ చేశాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని రైల్వే PSU షేర్లు ఒక్కసారిగా జోరుగా పరుగులు పెట్టాయి. ముఖ్యంగా RVNL, IRFC, IRCON, RailTel, Texmaco Rail వంటి కంపెనీల షేర్లు పెట్టుబడిదారులకు తక్కువ సమయంలోనే డబుల్ డిజిట్ రాబడులు అందించాయి. ఐదు రోజుల్లోనే ఈ స్టాక్స్ 20 శాతం నుంచి 26 శాతం వరకు లాభాలను నమోదు చేయడం మార్కెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

ఈ ర్యాలీలో ముందంజలో నిలిచింది రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL). ఈ కంపెనీ షేరు ధర సుమారు  రూ. 306 స్థాయి నుంచి రూ. 387.25 వరకు ఎగబాకింది. అంటే కేవలం ఐదు సెషన్లలోనే 26.5 శాతం లాభం. ఇదే సమయంలో IRFC షేరు రూ. 110.81 నుంచి రూ.133.60కి చేరి దాదాపు 20 శాతం రాబడిని ఇచ్చింది. IRCON ఇంటర్నేషనల్ కూడా రూ.150 నుంచి రూ.178.25 వరకు పెరిగి సుమారు 19 శాతం లాభాన్ని నమోదు చేసింది. వీటితో పాటు RailTel, Texmaco Rail, IRCTC షేర్లలో కూడా కొనుగోళ్ల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది.

అయితే.. ఇక్కడ ఒక కీలక ప్రశ్న ఏంటంటే.. కంపెనీల ప్రాథమిక అంశాల్లో పెద్ద మార్పులు లేనప్పటికీ రైల్వే స్టాక్స్ ఎందుకు ఇంత వేగంగా పెరిగాయి? మార్కెట్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..  ఈ ర్యాలీకి ప్రధాన కారణం కంపెనీల ఫండమెంటల్స్ కంటే మార్కెట్ సెంటిమెంట్‌లో వచ్చిన మార్పే . గత ఏడాది అధిక విలువలు, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు, మార్జిన్ ఒత్తిళ్ల కారణంగా రైల్వే స్టాక్స్ తీవ్రంగా పడిపోయాయి. ఆ దిద్దుబాటు తర్వాత ఇప్పుడు పెట్టుబడిదారులు ఈ రంగంలో కొత్త అవకాశాలను వెతుకుతున్నారు.

Also Read: D-Mart Shopping: సీలు చేసిన పాల ప్యాకెట్‌లో పురుగులు.. డీమార్ట్‌లో షాపింగ్ చేస్తున్నారా? ఇది చదివితే చమటలు పడతాయ్..!!

ఇక మరో కీలక అంశం బడ్జెట్ ముందు ఏర్పడిన అంచనాలు. ఫిబ్రవరి 2026లో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో రైల్వే మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తారనే ఆశలు మార్కెట్‌లో బలంగా ఉన్నాయి. నెట్‌వర్క్ విస్తరణ, కొత్త కోచ్‌లు, సిగ్నలింగ్ వ్యవస్థలు, భద్రతా అప్‌గ్రేడ్‌లు, ఆధునీకరణ వంటి ప్రాజెక్టులకు భారీ కేటాయింపులు ఉంటాయనే భావన పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతోంది. చరిత్రలోనూ బడ్జెట్ ముందు రైల్వే స్టాక్స్ బలంగా ర్యాలీ చేసిన సందర్భాలు ఉన్నాయి.

దీనికి తోడు.. FY26లో రెండో దశ ప్రయాణీకుల ఛార్జీల పెంపు కూడా తక్షణ ఉత్సాహానికి కారణమైంది. డిసెంబర్ 26, 2025 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఛార్జీల పెంపు ప్రయాణ తరగతిని బట్టి కిలోమీటరుకు 1 నుంచి 2 పైసల మేరే అయినప్పటికీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 600 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. ఇది రైల్వే ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందనే సంకేతంగా మార్కెట్ భావిస్తోంది.

అయితే.. ఈ ర్యాలీ మధ్య పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న లాభాలు ఎక్కువగా అంచనాలు, భావోద్వేగాల ఆధారంగా నడుస్తున్నాయని వారు చెబుతున్నారు. దీర్ఘకాలంలో నిజమైన రాబడులు రావాలంటే బడ్జెట్‌లో వచ్చే వాస్తవ కేటాయింపులు, ప్రాజెక్టుల అమలు వేగం, నగదు ప్రవాహం, ఛార్జీల సంస్కరణలు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి, తక్షణ లాభాలకే ఆకర్షితులవకుండా, కంపెనీల ప్రాథమిక బలాలు మరియు అమలు సామర్థ్యాన్ని పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం మేలని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి.

Also Read: Jayshree Ullal: టెక్ దిగ్గజాలను పక్కకు నెట్టి..రిచ్ లిస్టులో ఫస్ట్ ప్లేసులో నిలిచిన జయశ్రీ ఉల్లాల్..ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో  పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
BBhoomi
Dec 29, 2025 03:07:32
Secunderabad, Telangana:

Gold Rate Today: మన దేశానికి  ప్రతి ఏడాది భారీ మొత్తంలో బంగారం దిగుమతి అవుతుంది.  ఏడాది పొడవునా బంగారం కొనుగోళ్లు కొనసాగుతుంటాయి. భారతీయుల జీవితంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. వందల ఏళ్లుగా బంగారు ఆభరణాలు ధరించే సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఇటీవలి కాలంలో ఆభరణాలకే కాకుండా.. పెట్టుబడి సాధనంగా కూడా బంగారంపై ఆసక్తి గణనీయంగా పెరిగింది.

అయితే 2025లో బంగారం ధరలు ఊహించని స్థాయిలో దూసుకుపోతున్నాయి. గత కొన్ని నెలలుగా పసిడి ధరలు కొత్త కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఈ ధరల పెరుగుదలకు అనేక అంతర్జాతీయ అంశాలు కారణమవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా విధిస్తున్న సుంకాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.

ఇటీవల ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు బలపడటంతో గత వారం రోజులుగా బంగారం ధరలు వేగంగా పెరిగాయి. అయితే వరుస పెరుగుదల తర్వాత ఈ వారం ప్రారంభంలో ధరలు కొంత శాంతించాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 29వ తేదీన హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. అంతర్జాతీయ మార్కెట్లో ఈరోజు పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 18 డాలర్లకు పైగా పడిపోయింది. దాదాపు 0.41 శాతం మేర తగ్గడంతో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,501 డాలర్ల వద్దకు దిగివచ్చింది. మరోవైపు వెండి ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేదు. స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 76.88 డాలర్ల వద్ద స్థిరంగా ట్రేడవుతోంది.

ఈ అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత వారం రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర తులంపై ఏకంగా రూ.7,040 పెరిగింది. అయితే వరుస పెరుగుదల తర్వాత ఈరోజు ధరల్లో స్వల్ప ఊరట కనిపించింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,41,220 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,29,450గా ఉంది.

Also Read: Jayshree Ullal: టెక్ దిగ్గజాలను పక్కకు నెట్టి..రిచ్ లిస్టులో ఫస్ట్ ప్లేసులో నిలిచిన జయశ్రీ ఉల్లాల్..ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

వెండి ధరలు కూడా ఈరోజు స్థిరంగానే ఉన్నాయి. నిన్న ఒక్కరోజులోనే కిలో వెండిపై రూ.20,000 పెరిగి ఆల్‌టైమ్ హై స్థాయిని తాకిన వెండి, ఈరోజు అదే ధర వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,74,000గా నమోదైంది.

పసిడి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరగడం దేశీయ ధరలకు ప్రధాన కారణంగా మారింది. అమెరికాలో గత శుక్రవారం బంగారం ధర ఒక ఔన్స్ (సుమారు 31.2 గ్రాములు) 4,530 డాలర్ల స్థాయిని తాకి ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసింది. ఈ విషయాన్ని రాయిటర్స్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. అంతర్జాతీయంగా నమోదైన ఈ రికార్డు ప్రభావం భారత మార్కెట్‌పై నేరుగా పడింది.

ఇదే సమయంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ఉన్న అంచనాలు కూడా బంగారానికి మద్దతుగా మారాయి. 2026లో కూడా వడ్డీ రేట్లలో కోత ఉండొచ్చన్న వార్తలు మార్కెట్‌లో వినిపిస్తున్నాయి. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియమించబోయే కొత్త ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ వడ్డీ రేట్ల విషయంలో సాఫ్ట్ దృక్పథం కలిగి ఉంటారన్న అంచనాలు కూడా పసిడి ధరలను మరింత బలపరిచాయి.

డాలర్ పతనం, ఆర్థిక మందగమనం ప్రభావం:

అమెరికా డాలర్ విలువ భారీగా తగ్గడం కూడా బంగారం ధరల పెరుగుదలకు మరో ముఖ్య కారణంగా చెప్పవచ్చు. 2020 సంవత్సరంలో డాలర్ ఇండెక్స్ దాదాపు 9 శాతం మేర నష్టపోయింది. 2017 తర్వాత ఇదే అతిపెద్ద పతనంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డాలర్ బలహీనపడటంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం చౌకగా కనిపిస్తుంది. దీంతో అనేక దేశాలు బంగారం కొనుగోళ్లను పెంచుతాయి. ఈ డిమాండ్ పెరుగుదల ధరలను మరింత పైకి నెట్టేస్తుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో మందగమనం సంకేతాలు కనిపించడం కూడా పసిడి ధరలకు అనుకూలంగా మారింది. ఉద్యోగాల తగ్గుదల, వ్యాపార వృద్ధి మందగిస్తుందన్న అంచనాలతో పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లకు దూరంగా ఉంటూ సురక్షిత పెట్టుబడులైన బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.

Also Read: D-Mart Shopping: సీలు చేసిన పాల ప్యాకెట్‌లో పురుగులు.. డీమార్ట్‌లో షాపింగ్ చేస్తున్నారా? ఇది చదివితే చమటలు పడతాయ్..!!

వెండి ధరలు కూడా రికార్డుల బాట:

బంగారంతో పాటు వెండి ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు భారీ నష్టాలను ఎదుర్కొనడం, ప్రపంచవ్యాప్తంగా మెటల్ మార్కెట్‌లో బలమైన డిమాండ్ ఉండటంతో వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. వెండితో పాటు ప్లాటినం వంటి ఇతర విలువైన లోహాల ధరలు కూడా పెరుగుతున్నాయి. కిలో వెండి ధర రూ.2.50 లక్షలు దాటడం దేశీయ బులియన్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత గరిష్ట స్థాయిగా నిపుణులు పేర్కొంటున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
RKRavi Kumar Sargam
Dec 29, 2025 00:26:58
Tirupati, Andhra Pradesh:

Tirumala Lands: తిరుపతి అలిపిరి సమీపంలోని దేవలోక్ ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) చెందిన పవిత్ర భూములను కార్పొరేట్ హోటల్‌కు కేటాయించడం ఘోర అపచారంగా సీపీఐ జాతీయ నాయకుడు కె. నారాయణ విమర్శించారు. దేవస్థానం భూములను కాపాడిన ఫలితంగానే నేడు ఆ భూములు విద్యాలయాలు, ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. అలాంటి భూములు ఇప్పుడు కార్పొరేట్‌లకు అప్పగించడాన్ని తప్పుబట్టారు.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి సీతక్క భారీ శుభవార్త.. పీఆర్సీ, పెండింగ్ బిల్లులు ఎప్పుడంటే?

తిరుపతి అలిపిరి సమీపంలోని దేవలోక్ వద్ద ఒబెరాయ్ హోటల్‌కు కేటాయించిన భూమిని ఆదివారం సీపీఐ పార్టీ నాయకులతో కలిసి కె. నారాయణ పరిశీలించారు. భూమి వివరాలు ఆరా తీసి ఇక్కడ హోటల్‌ కట్టరాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనులను క్షుణ్ణంగా పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుపతి అలిపిరి వద్ద ఒబెరాయ్‌ హోటల్‌ నిర్మాణంపై తమ అభ్యంతరాలను నారాయణ స్పష్టంగా వెల్లడించారు.

Also Read: KCR In Assembly: తెలంగాణ అసెంబ్లీ షెడ్యూల్‌ ఇదే!.. అసెంబ్లీకి కేసీఆర్‌ సారూ వచ్చేస్తున్నాడు

ఈ భూమంతా పూర్తిగా టీటీడీ పరిధిలోదేనని.. నేరుగా ఇవ్వలేక టూరిజం లేదా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు ఇచ్చినట్లు చూపించి, అక్కడి నుంచి ఒబెరాయ్ హోటల్ గ్రూప్‌కు సుమారు 25 ఎకరాలు కేటాయిస్తున్నారని కె. నారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. ధర ఎంత, లంచాలు ఎంత అన్నది పక్కనపెడితే.. అసలు దేవస్థానానికి చెందిన భూమిలో స్టార్ హోటల్ ఎలా కడతారని ప్రశ్నించారు. స్టార్ హోటల్ అంటే పబ్‌లు, బార్లు, మాంసాహారం ఉంటాయని, ఇలాంటి వాటిని దేవుడు ఒప్పుకుంటాడా అని నిలదీశారు.

Also Read: Drugs Case: పండుగలప్పుడే డ్రగ్స్ కేసులు నమోదు చేస్తారా? బండి సంజయ్‌ ఆగ్రహం

స్టార్ హోటల్‌కు అలిపిరిలో భూమి కేటాయింపు నిర్ణయం తీసుకునే హక్కు టీటీడీ బోర్డుకు ఉందా? లేక రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఉందా? అని నారాయణ ప్రశ్నించారు. దీనికి అసలు రిమోట్ కంట్రోల్ ఢిల్లీలో ఉందని తమకు స్పష్టమవుతోందని విమర్శించారు. ఢిల్లీ కార్పొరేట్ కంపెనీల అధిపతులు.. వారికి మద్దతుగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా సంబంధం లేకుండా ఇలాంటి నిర్ణయాలు జరగవని తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు తిరుపతిలోనే చదువుకుని, ఈ ప్రాంతాన్ని బాగా తెలిసిన వ్యక్తి అని నారాయణ తెలిపారు. దేవుడిపై నిజమైన భక్తి ఉంటే ఇలాంటి పవిత్ర భూమిని కార్పొరేట్ హోటల్‌కు ఇచ్చే ఆలోచన రాదని స్పష్టం చేశారు. తిరుమల తిరుపతిని కార్పొరేట్‌ పరం చేయరాదని.. ఇక్కడ హోటల్‌ నిర్మాణం ఆపివేయాలని నారాయణ డిమాండ్‌ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Dec 29, 2025 00:13:50
Nagarkurnool, Telangana:

Congress Loots Telangana: తన ప్రాణాలు పణంగా పెట్టి కేసీఆర్‌ పోరాడి సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణను చేస్తే రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ దోచుకుంటోందని మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. పాలమూరును మళ్లీ వలసల జిల్లాగా మార్చిన ఘనత రేవంత్‌కే దక్కుతుందని ప్రకటించారు. పాలమూరు నీళ్ల కోసం కేసీఆర్ పోరాటానికి సిద్ధమని తెలిపారు. రైతు బంధు పోయి రాబంధు పాలన వచ్చిందని.. యూరియా క్యూలైన్లే దీనికి నిదర్శనం అని పేర్కొన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పండబెట్టిన కాంగ్రెస్‌పై కేసీఆర్ మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారని.. దీంతో కాంగ్రెస్–బీజేపీ చీకటి స్నేహం బయటపడిందని మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు.

నాగర్ కర్నూల్ సభలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు జిల్లాను కేసీఆర్‌ సస్యశ్యామలం చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయిందని తెలిపారు. 'తట్టెడు మట్టి కూడా తీయకుండా నికృష్టపు మాటలు మాట్లాడుతున్నాడు. కాంగ్రెసోళ్లు పాలమూరును మళ్లీ వలసల జిల్లాగా మార్చారు' కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులను పండబెట్టి పాలమూరు జిల్లాను ఎండబెట్టారని విమర్శించారు.

కేసీఆర్ ప్రభుత్వంలో పాలమూరు ప్రాజెక్టు 90 శాతం పూర్తి చేశామని మాజీ మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. టెండర్లను రద్దు చేసి ప్రాజెక్టును పండబెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీటి కేటాయింపుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి రాజీ పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును కాపాడుకుని రైతులకు అండగా నిలబడేందుకు, తెలంగాణ నీటి వాటాల ప్రయోజనాలను కాపాడేందుకు కేసీఆర్ మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారని కేటీఆర్ తెలిపారు. త్వరలోనే పాలమూరుకు కేసీఆర్ రాబోతున్నారని.. ఆయన చేయబోయే ఈ పోరాటానికి పాలమూరు బిడ్డలంతా అండగా నిలబడాలని మాజీ మంత్రి కేటీఆర్‌ కోరారు.

కమీషన్ల మీద ఉన్న ప్రేమ రేవంత్ రెడ్డికి రైతుల మీద లేదని.. ఈ సమయంలో ప్రజలు కేసీఆర్‌ రావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రైతు బంధు పాలన పోయి రేవంత్ రాబంధు పాలన వచ్చిందని ఎద్దేవా చేశారు. రైతులు యూరియా బస్తాల కోసం కాళ్ల మీద పడి గోస పడుతున్నారని, చలిలో చెప్పులు క్యూలైన్‌లో పెట్టి నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని వివరించారు. రేవంత్‌కు రైతుల పట్ల ప్రేమ లేదని, కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని వచ్చాయని గుర్తు చేశారు. 

రేవంత్ ఎక్కడికి పోయినా కేసీఆర్ మీద ఏడుపే కనిపిస్తోందని.. రేవంత్ ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే రేపోమాపో కరుస్తాడేమో అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. దమ్ముంటే యూరియా బస్తాలు దొరికేలా చేస్తా అని రేవంత్‌ రెడ్డి శపథం చేయాలని, రూ.4000 పెన్షన్ ఇస్తానని శపథం చేయాలని సవాల్ విసిరారు. ప్రజలను మోసం చేస్తున్నారని.. కేసీఆర్ కంటే అన్ని ఎక్కువిస్తామని ఆశ పెట్టారని, హామీల అమలు ఏమైందని నిలదీస్తే రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతున్నారని వెల్లడించారు. పథకాలు అడిగితే రేవంత్ బూతులు మాట్లాడుతున్నాడని, మహాలక్ష్మి పథకం ఏమైందంటే గుడ్లు పీకి గోటీలాడతానంటున్నాడని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. గ్రామాలను కేసీఆర్‌ ఎంతో అభివృద్ధి చేశారని, వైకుంఠధామాలు కట్టారని, డంప్ యార్డ్‌లు నిర్మించారని మాజీ మంత్రి కేటీఆర్‌ వివరించారు. ప్రతి గ్రామాన్ని దేశానికే ఆదర్శవంతంగా తీర్చిదిద్దింది కేసీఆర్ అని గుర్తుచేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Dec 29, 2025 00:08:50
Hyderabad, Telangana:

KCR In Assembly: ప్రత్యర్థులు రెచ్చగొడుతూ.. దూషణలు చేస్తూ విచక్షణ లేకుండా మాట్లాడుతుంటే మౌనంగా చూసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కదిలి వస్తున్నాడు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు. శీతాకాల సమావేశాల ప్రారంభానికి బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ రానున్నారు. ఇప్పటికే ప్రెస్‌మీట్‌ పెట్టి 'ఐ యామ్‌ ఆన్‌ ద ఫీల్డ్‌' అని ప్రకటించిన కేసీఆర్‌ ఇక అసెంబ్లీకి హాజరవుతున్నారంటే సభ ఎలా జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ శీతాకాల శాసన సభ సమావేశాల టేబుల్‌పై 11 కీలక పత్రాలు ప్రభుత్వం ఉంచనుంది. జీఎస్టీ సవరణ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. జీహెచ్‌ఎంసీ సవరణ ఆర్డినెన్స్‌లు సభ టేబుల్‌ చేయనుంది. తెలంగాణ మున్సిపాలిటీస్ రెండో సవరణ ఆర్డినెన్స్ ప్రవేశం, సమగ్ర శిక్ష (టీఎస్‌ఎస్‌ఎస్‌) 2023-24 ఆడిట్ నివేదిక సమర్పణ, పీఎం శ్రీ (పీఎం శ్రీ) పాఠశాలల ఆడిట్ నివేదికను సభలో ప్రభుత్వం పెట్టనుంది.

సమావేశాల్లో ప్రభుత్వ నియామకాల చట్ట సవరణ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. సిబ్బంది నిర్మాణం, జీతాలపై రెండో సవరణ ఆర్డినెన్స్ పెట్టనుండగా.. పంచాయతీరాజ్ మూడో సవరణ ఆర్డినెన్స్ ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది. పంచాయతీరాజ్ శాఖ గెజిట్ నోటిఫికేషన్ సమర్పించనుంది. తెలంగాణ హార్టికల్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వార్షిక నివేదికలు ఉండనున్నాయి. అయితే తొలి రోజు మాత్రం మాజీ సభ్యులకు సంతాపం తెలిపే కార్యక్రమం మాత్రమే ఉంటుంది.

ఇటీవల మరణించిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యుల మృతిపై సంతాప తీర్మానాలు సభ చేయనుంది. సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి దామోదర్ రెడ్డికి, రంగారెడ్డి జిల్లా మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డికి సభ సంతాపం తెలపనుంది. అనంతరం శాసనసభ వాయిదా పడుతుంది. సభా సలహా మండలి (బీఏసీ) సమావేశం కానుంది. స్పీకర్ చాంబర్‌లో జరగనున్న బీఏసీ భేటీకి అసెంబ్లీ సమావేశాల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చ జరగనుంది.

ఈ సమావేశానికి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు, రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆహ్వానం పలకగా.. శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌ పాల్గొననుండగా.. ప్రభుత్వ విప్ బీర్ల ఐలెయ్య, పలువురు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. 2,3 వ తేదీలో నిర్వహించే సభకు సంబంధించిన ఎజెండా, సభను ఎన్ని రోజులు నిర్వహించాలి అనేది బీఏసీ సమావేశం నిర్ణయం తీసుకోనుంది.

0
comment0
Report
RKRavi Kumar Sargam
Dec 28, 2025 17:40:53
Hyderabad, Telangana:

Telangana PRC Update: ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు మంత్రి సీతక్క శుభవార్త వినిపించారు. సుదీర్ఘ కాలంగా ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని ప్రకటించారు. సొంత హక్కుల కోసం ఉపాధ్యాయులు పోరాడుతూనే.. ప్రతి ఒక్కరికి చదువు అందుబాటులో ఉండాలని సూచించారు. టీచర్ల పోరాటాలు న్యాయమైనవని ధనసరి అనసూయ ప్రకటించారు.

టీఎస్‌యూటీఎఫ్ సమావేశంలో సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై స్పందించి కీలక ప్రకటనలు చేశారు. 'ప్రభుత్వ విద్య బలోపేతం కావాలి అని మీరు పోరాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను ఒక్కొక్కటిగా తీరుస్తోంది. ఉపాధ్యాయ భర్తీలను చేపట్టి మీ పని భారాన్ని తగ్గించింది. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు, బదిలీలను చేపట్టింది' అని సీతక్క గుర్తుచేశారు. ఇక వేతన సవరణ సంఘం (పీఆర్సీ), పెండింగ్ బకాయిలు ఉన్నాయనే విషయం తెలుసు. మీ సమస్యలు.. మీ ఆవేదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా' అని హామీ ఇచ్చారు. 'కారుణ్య నియామకాలు, పాఠశాల సమయ సవరణ, రిటైర్మెంట్  బెనిఫిట్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం' అని సీతక్క హామీ ఇచ్చారు. 

'ఉపాధ్యాయుల సేవలపై స్పందిస్తూ.. పిల్లల నడవడికను తీర్చిదిద్దేవీ పాఠశాలలే. పిల్లల భవిష్యత్తును ఆదర్శవంతంగా.. స్ఫూర్తిదాయకంగా తీర్చిదిద్దాలి. లక్షల మంది మేధావులను తీర్చిదిద్దేది టీచర్లే. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది. ఆ తరగతి గదుల బాధ్యతను టీచర్లు నిర్వర్తిస్తున్నారు . నాణ్యమైన విద్య సామాన్యులకు అందుబాటులో ఉండాలి' అని సీతక్క తెలిపారు. ప్రభుత్వ విద్య బలపేతంలో టీచర్ల భాగస్వామ్యం.. సహకారం ఎంతో ముఖ్యమైనదని గుర్తుచేశారు.

'ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఉపాధిని హక్కుగా పొందకుండా కేంద్ర భిక్షగా భావిస్తుంది. అందుకే ఉపాధి హామీ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తెచ్చారు. ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి తీసుకురావడంలో ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత టీచర్ల మీద ఉంది' అని సీతక్క సూచించారు. సామాన్యుల పక్షాన పోరాటం చేయాల్సిన బాధ్యత కూడా టీచర్ల మీద ఉందని చెప్పారు. ప్రభుత్వ టీచర్లకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు.

'సమాజ జ్ఞానాన్ని, శ్రమను గౌరవించడం ప్రజల కోసం జీవించాలనే సిద్ధాంతాన్ని, విలువలను మన జీవితంలో పాటిస్తూ లక్షలాది మంది విద్యార్థులను టీచర్లు తీర్చిదిద్దాలి. ప్రైవేట్ విద్యా సంస్థలకు తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలలను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలి' అని సీతక్క సూచించారు. 'టీచర్ల చేతిలో దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ప్రభుత్వం మీకు పూర్తిస్థాయిలో సహకరిస్తుంది. కేరళ తరహాలో అక్షరాస్యతలో తెలంగాణ ముందంజలో ఉంచేలా కలిసి కృషి చేద్దాం' అని పిలుపునిచ్చారు. 'అందరి జీవితాలను తీర్చిదిద్ది ఆదర్శవంతులుగా తీర్చిదిద్దే వ్యవస్థ విద్యా వ్యవస్థ. అలాంటి పవిత్ర వ్యవస్థలో టీచర్లు ఉన్నారు. విద్యతోనే విముక్తి సాధ్యమవుతుంది' అని సీతక్క వివరించారు.

0
comment0
Report
BBhoomi
Dec 28, 2025 12:43:07
Secunderabad, Telangana:

LIC New Jeevan Shanti: ఉద్యోగం, వ్యాపారం ఇలా జీవితాంతం కష్టపడి ఎన్నో బాధ్యతలను భుజాన వేసుకుని డబ్బు సంపాదించేవారు ఎంతో మంది ఉన్నారు. పెళ్లి, పిల్లలు, కుటుంబం, పిల్లలు చదువు, పెళ్లిళ్లు ఇలా సంపాదించిన డబ్బంతా ఖర్చు అవుతుంది. కానీ రిటైర్మెంట్ తర్వాత భవిష్యత్తు ఏంటి? వయస్సు ఉన్నప్పుడు సంపాదించిన డబ్బు.. వయస్సు మీద పడిన తర్వాత ఆర్థిక కష్టాలు రాకుండా ఉండేందుకు చాలా మంది పలు రకాలుగా పెట్టుబడి పెడుతుంటారు. మీరు కూడా రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ ప్లాన్ ఒకేసారి పెట్టుబడి పెడితే జీవితాంతం పెన్షన్ లభిస్తుంది. అదే ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి పథకం. ఈ స్కీములో ఇన్వెస్ట్ చేస్తే నెల నెలా చేతికి డబ్బు అందుతుంది. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్ఐసీ అందించే స్కీములపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉంటుంది. భద్రతతోపాటు స్థిరమైన రాబడి కోరుకునేవారికి న్యూ జీవన్ శాంతి స్కీమ్ ప్రత్యేకంగా రూపొందించింది ఎల్ఐసీ. రిటైర్మెంట్ తర్వాత కూడా క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే విధంగా ఈ స్కీమ్ పనిచేస్తుంది. 

LIC న్యూ జీవన్ శాంతి అంటే ఏమిటి?

ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి ఒక డిఫర్డ్ యాన్యుటీ పెన్షన్ ప్లాన్. అంటే మీరు ఈ స్కీము తీసుకునే సమయంలో ఒకేసారి డబ్బు ఇన్వెస్ట్ చేస్తారు. ఆ తర్వాత నిర్ణీత కాలం తర్వాత లాక్ ఇన్ పీరియడ్ పూర్తయిన తర్వాత మీకు పెన్షన్ వస్తుంది. ఒకసారి పెన్షన్ ప్రారంభం అవుతే.. జీవితాంతం అంతే మొత్తాన్ని పొందుతారు. ఈ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత.. పెన్షన్ ఎంత రావాలి.. ఏవిధంగా రావాలనే విషయాలను మొదట్లోనే నిర్ణయించుకోవచ్చు. ఆ తర్వాత మార్చుకునేందుకు అవకాశం ఉండదు. అందుకే ఇది రిటైర్మెంట్ అయిన వారికి మంచి భరోసానిస్తుంది. 

5 సంవత్సరాల లాక్-ఇన్ తోపాటు రెండు పెన్షన్ ఎంపికలు:

ఈ స్కీములో 5ఏళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు ఐదేళ్ల వరకు లాక్ లోనే ఉంటుంది. ఈ కాలం పూర్తి అయిన తర్వాత మీకు పెన్షన్ వస్తుంది. 

ఈ ప్లాన్‌లో రెండు ఎంపికలు ఉన్నాయి:

- సింగిల్ లైఫ్ డిఫర్డ్ యాన్యుటీ – ఒకే వ్యక్తికి జీవితాంతం పెన్షన్

- జాయింట్ లైఫ్ డిఫర్డ్ యాన్యుటీ – దంపతుల కోసం, ఒకరు లేనప్పుడు మరొకరికి పెన్షన్ కొనసాగుతుంది

- మీ అవసరాన్ని బట్టి ఈ రెండింటిలో ఏదైనా ఎంచుకోవచ్చు.

Also Read: Jayshree Ullal: టెక్ దిగ్గజాలను పక్కకు నెట్టి..రిచ్ లిస్టులో ఫస్ట్ ప్లేసులో నిలిచిన జయశ్రీ ఉల్లాల్..ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

యాన్యుటీ ఎలా పని చేస్తుంది?

-ఈ పథకంలో పెన్షన్ జీవితాంతం వస్తుంది.

- సింగిల్ లైఫ్ ప్లాన్ తీసుకుని పాలసీదారు మరణిస్తే, పెట్టుబడి చేసిన మొత్తం నామినీకి చెల్లిస్తారు.

- జాయింట్ లైఫ్ ప్లాన్‌లో ఒకరు మరణించినా, రెండో వ్యక్తికి పెన్షన్ కొనసాగుతుంది. ఇద్దరూ మరణిస్తే, మొత్తం డబ్బు నామినీకి ఇస్తారు.

-అందువల్ల పెట్టుబడి చేసిన డబ్బు సురక్షితంగా ఉంటుంది.

వయోపరిమితి..ఇతర ముఖ్యమైన ప్రయోజనాలు:

ఈ పాలసీ తీసుకోవాలంటే.. కనీస వయస్సు 30 సంవత్సరాలు ఉండాలి.  గరిష్ట వయస్సు 79 సంవత్సరాలుగా ఉండాలి. ఇందులో లైఫ్ రిస్క్ కవర్ ఉండదు.  స్థిరమైన ఆదాయం కోరుకునేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.

ఈ పథకంలో మరో ముఖ్యమైన లాభం ఏమిటంటే:

-మీరు కావాలంటే పాలసీని మధ్యలో సరెండర్ చేయవచ్చు

-పెన్షన్‌ను నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక లేదా వార్షికంగా తీసుకోవచ్చు

Also Read: D-Mart Shopping: సీలు చేసిన పాల ప్యాకెట్‌లో పురుగులు.. డీమార్ట్‌లో షాపింగ్ చేస్తున్నారా? ఇది చదివితే చమటలు పడతాయ్..!!

రూ.1 లక్ష వార్షిక పెన్షన్ ఎలా వస్తుంది?

ఉదాహరణకు..55 ఏళ్ల వయస్సులో ఉన్న వ్యక్తి ఈ ప్లాన్‌లో సుమారు రూ. 11 లక్షలు ఒకేసారి పెట్టుబడి పెట్టి, 5ఏళ్ల లాక్-ఇన్ పూర్తి చేసినట్లయితే వార్షికంగా సుమారు  రూ. 1,01,880 పెన్షన్ వస్తుంది. అర్ధవార్షికంగా రూ.49,911..నెలవారీగా సుమారు రూ. 8,149 పెన్షన్ పొందవచ్చు. అలాగే, కనీసంగా రూ. 1.5 లక్షల పెట్టుబడితో కూడా సుమారు రూ. 1,000 హామీ పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం పొందాలనుకునేవారికి ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి స్కీమ్ ఒక సురక్షితమై.. నమ్మదగిన పెన్షన్ ప్లాన్ అని చెప్పవచ్చు. ఒకేసారి ఇన్వెస్ట్ చేసి.. జీవితాంతం ఆదాయం పొందాలనుకునేవారికి ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. 
 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

 

0
comment0
Report
BBhoomi
Dec 28, 2025 12:06:44
Secunderabad, Telangana:

EPFO Single Window: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సేవలను మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మార్పుల వల్ల ఇక నుంచి పీఎఫ్ విత్ డ్రా, ఫిర్యాదుల పరిష్కారం, కేవైసీ ధ్రువీకరణ వంటి పనుల కోసం ఖాతాదారులు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. కేంద్రం తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యమైనది.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఈపీఎఫ్ఓ కార్యాలయాలను సింగిల్ విండో సర్వీస్ సెంటర్లుగా మార్చడమే. దీని ద్వారా పీఎఫ్ ఖాతాదారులు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇక నుంచి తమ ఖాతా అనుబంధంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. దేశంలోని ఏ ఈపీఎఫ్ఓ కార్యాలయం సందర్శించినా తమ పనులు పూర్తవుతాయి. 

పాస్‌పోర్ట్ కార్యాలయాల తరహాలో EPFO సేవలు:

ఈపీఎఫ్ఓ ప్రావిడెంట్ ఫండ్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ విషయాలను వెల్లడించారు. EPFO కార్యాలయాలను పాస్‌పోర్ట్ కార్యాలయాల మాదిరిగా పునఃరూపకల్పన చేస్తామని.. అక్కడ సింగిల్ విండో వ్యవస్థను అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా ఢిల్లీలో ప్రారంభించారు.

ఈ మార్పులతో EPFO సేవలు పూర్తిగా డిజిటల్ ఆధారితంగా మారనున్నాయి. ఆన్‌లైన్ విధానాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు సహాయం చేయడానికి  EPF సువిధ ప్రొవైడర్లు  అనే కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. వీరు ఖాతాదారులు EPFO మధ్య వారధిగా పనిచేస్తూ, క్లెయిమ్ ప్రాసెసింగ్, KYC, ఫిర్యాదుల పరిష్కారంలో సహకరిస్తారు.

ఖాతాదారులకు లభించే ముఖ్యమైన ప్రయోజనాలు:

ఈ కొత్త వ్యవస్థ వల్ల విదేశాల్లో పనిచేసి తిరిగి వచ్చిన ఉద్యోగులు తమ పీఎఫ్ డబ్బును కోల్పోరు. వారు భారత్‌కు వచ్చిన తర్వాత సులభంగా తమ డిపాజిట్లను విత్ డ్రా చేసుకోవచ్చు.  అలాగే ఏళ్లుగా క్లెయిమ్ చేయకుండా నిలిచిపోయిన పీఎఫ్ ఖాతాల విషయంలో ప్రభుత్వం మిషన్ మోడ్‌లో KYC ధృవీకరణ చేపడుతుంది. ఖాతాదారులు లేకపోతే వారి కుటుంబ సభ్యులను గుర్తించి, నిజమైన వారికే డబ్బు తిరిగి అందజేస్తారు.

Also Read: Jayshree Ullal: టెక్ దిగ్గజాలను పక్కకు నెట్టి..రిచ్ లిస్టులో ఫస్ట్ ప్లేసులో నిలిచిన జయశ్రీ ఉల్లాల్..ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

సామాజిక భద్రతలో విస్తృత కవరేజ్:

మంత్రి మాండవీయ మాట్లాడుతూ.. 2014లో దేశ జనాభాలో కేవలం 19 శాతం మందికే సామాజిక భద్రత లభించేదని.. ప్రస్తుతం అది 64 శాతానికి పెరిగిందని తెలిపారు. చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశమని.. నేడు దాదాపు 94 శాతం మంది ప్రజలు ఏదో ఒక రూపంలో సామాజిక భద్రతను పొందుతున్నారని ఆయన వివరించారు.

గతంతో పోలిస్తే ఇప్పుడు మార్పులు ఏంటి?

పీఎఫ్ సమస్యల కోసం తప్పనిసరిగా మీ బ్రాంచ్ ఆఫీసుకే వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం ఏ EPFO కార్యాలయాన్ని అయినా సందర్శించవచ్చు. గతంలో బ్రోకర్లపై ఆధారపడాల్సి వచ్చేది లేదా మీరే క్లిష్టమైన ప్రక్రియను ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇకపై EPF సువిధ ప్రొవైడర్లు పూర్తి మార్గనిర్దేశం చేస్తారు. KYC కారణంగా డబ్బు నిలిచిపోవడం వంటి సమస్యలు తగ్గి, డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా వేగంగా పరిష్కారం లభిస్తుంది.

EPFOలో తీసుకొస్తున్న ఈ సంస్కరణలు పీఎఫ్ ఖాతాదారులకు నిజమైన ఊరటను కలిగించేలా ఉన్నాయి. తక్కువ సమయం..  ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కువ పారదర్శకత అందించడమే ఇదే ఈ కొత్త వ్యవస్థ లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.

Also Read: D-Mart Shopping: సీలు చేసిన పాల ప్యాకెట్‌లో పురుగులు.. డీమార్ట్‌లో షాపింగ్ చేస్తున్నారా? ఇది చదివితే చమటలు పడతాయ్..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
BBhoomi
Dec 28, 2025 11:34:54
Secunderabad, Telangana:

Explanation for the Rise in Silver Prices: బంగారం.. కాదు.. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది వెండి. బంగారాన్ని పక్కకు నెట్టి వెండి జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డులు బద్దలు కొడుతోంది. కిలో వెండి ధర రూ. 2.75లక్షలు ఉంది. రాబడి పరంగా చూస్తే.. వెండి బంగారాన్ని మాత్రమే కాదు  ఈక్విటీ మార్కెట్లను కూడా వెనక్కి నెట్టేసింది. అయితే.. ఈ పెరుగుదల చూసి చాలామందికి ఇది కేవలం ఊహాజనిత బుడగేనా అనే అనుమానం వస్తోంది. కానీ లోతుగా పరిశీలిస్తే.. వెండి ధరల ర్యాలీకి వెనుక చాలా బలమైన, దీర్ఘకాలిక కారణాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇది కేవలం ఇన్వెస్టర్ల భావోద్వేగాల వల్ల వచ్చిన పెరుగుదల కాదు.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న పారిశ్రామిక అవసరాల ఫలితమని చెప్పవచ్చు. వెండి వెలుగుల వెనుకున్న ఐదు రంగా గురించి తెలుసుకుందాం. డిమాండ్ ఇలాగే కొనసాగినట్లయితే కిలో వెండి ధర రూ. 6లక్షలకు చేరుకోవడం ఖాయమని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. 

ప్రస్తుతం వెండి డిమాండ్‌ను ముందుకు నడిపిస్తున్న ఐదు కీలక రంగాలు ఉన్నాయి. ఇవి ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా అత్యంత అవసరమైన రంగాలు కావడం విశేషం. ఈ రంగాలు బలంగా ఉన్నంతకాలం వెండికి డిమాండ్ తగ్గే అవకాశమే లేదు.

సౌర విద్యుత్ రంగం: 

ప్రపంచం మొత్తం గ్రీన్ ఎనర్జీ వైపు మళ్లుతున్న నేపథ్యంలో..  సౌర విద్యుత్ రంగం వెండికి అతిపెద్ద డిమాండ్ కేంద్రంగా మారింది. ఒక సౌర ప్యానెల్ తయారీలో సగటున 15 నుంచి 20 గ్రాముల వెండిని ఉపయోగిస్తారు. గత నాలుగేళ్లలో సౌర రంగం నుంచి వచ్చే వెండి డిమాండ్ రెండింతలు పెరిగింది. 2020లో సుమారు 94 మిలియన్ ఔన్సులుగా ఉన్న డిమాండ్.. 2024 నాటికి 240 మిలియన్ ఔన్సులకు పైగా చేరింది. భారత్ కూడా ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తోంది. దేశం ఇప్పటికే 100 గిగావాట్లకు పైగా సౌర సామర్థ్యాన్ని సాధించింది. 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర శక్తి లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈ వేగంతో చూస్తే, భవిష్యత్తులో ప్రపంచ వెండి డిమాండ్‌లో సౌర రంగం వాటా మరింత పెరగనుంది.

ఎలక్ట్రిక్ వాహనాల రంగం: 

పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే.. ఎలక్ట్రిక్ వాహనాల్లో వెండి వినియోగం రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. బ్యాటరీలు, వైర్లు, కనెక్టర్లు, పవర్ కంట్రోల్ యూనిట్లలో వెండి కీలక పాత్ర పోషిస్తుంది. ఒక ఎలక్ట్రిక్ కారుకు సగటున 25 నుంచి 50 గ్రాముల వెండి అవసరం అవుతుంది. అంతేకాదు, ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లకు కిలోల కొద్దీ వెండి అవసరం అవుతోంది. భారతదేశం 2030 నాటికి తన ప్రైవేట్ వాహనాల్లో 30 శాతం EVలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల, వెండి డిమాండ్ మరింత పెరగడం ఖాయం.

ఎలక్ట్రానిక్స్ , AI డేటా సెంటర్లు:

డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు డేటా సెంటర్లు ప్రాణం. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, పవర్ డిస్ట్రిబ్యూషన్ ఇలా అన్ని రంగాల్లో వెండి కీలక లోహంగా మారింది. భారత్‌లో రిలయన్స్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు భారీ AI డేటా సెంటర్లను నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులు వెండి వినియోగాన్ని గణనీయంగా పెంచుతున్నాయి. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా వెండి సరఫరా డిమాండ్‌ను తట్టుకోలేకపోతోంది. 2024లో డిమాండ్ 1.16 బిలియన్ ఔన్సులు ఉండగా.. ఉత్పత్తి మాత్రం 820 మిలియన్ ఔన్సులకే పరిమితమైంది.

Also Read: PF And Payroll Changes: ఎంత జీతం వస్తుంది? PF ఎంత కట్ అవుతుంది? కొత్త రూల్స్ తో 2026లో ఏం మారనుంది..?

వైద్య, ఆరోగ్య సంరక్షణ రంగం:

వెండికి ఉన్న యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాల వల్ల, ఇది వైద్య పరికరాల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. కాలిన గాయాల డ్రెస్సింగ్‌లు, శస్త్రచికిత్స పరికరాలు, కాథెటర్లు, ఇంప్లాంట్లు ఇలా అన్నింటిలో వెండి పూతలు వాడుతున్నారు. భారతదేశంలో ఆరోగ్య రంగం వేగంగా విస్తరిస్తుండటంతో, వెండి ఆధారిత వైద్య ఉత్పత్తుల డిమాండ్ కూడా పెరుగుతోంది.

5G భవిష్యత్తు 6G మౌలిక సదుపాయాలు:

5G టెక్నాలజీకి అత్యుత్తమ విద్యుత్ వాహకత అవసరం. అది వెండిలో ఉంది. యాంటెనాలు, బేస్ స్టేషన్లు, సర్క్యూట్ బోర్డులు, స్విచ్‌లలో వెండి తప్పనిసరి. భారత్ ఇప్పటికే లక్షల సంఖ్యలో 5G టవర్లను ఏర్పాటు చేసింది. 2030 నాటికి దాదాపు బిలియన్ మంది 5G వినియోగదారులు ఉండనున్నారని అంచనా.

Also Read: Gold Investment Strategy: ట్రంప్ ఉన్నంత కాలమే ఈ గోల్డ్ రన్ .. ఇప్పుడే చేయాల్సిన స్మార్ట్ మెటల్స్ ప్లాన్ ఇదే.. ఈ సింపుల్ స్ట్రాటజీతో భారీ లాభాలు..!!

మొత్తంగా చూస్తే.. వెండి ధరల ర్యాలీ వెనుక ఊహాగానాల కంటే బలమైన పారిశ్రామిక అవసరాలే ప్రధాన కారణమని చెప్పవచ్చు. సరఫరా పరిమితంగా ఉండగా.. డిమాండ్ మాత్రం బహుళ రంగాల నుంచి వేగంగా పెరుగుతోంది. అందుకే వెండి పెరుగుదల ఒక తాత్కాలిక ట్రెండ్ కాకుండా, దీర్ఘకాలిక నిర్మాణాత్మక మార్పుగా కనిపిస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Dec 28, 2025 09:06:49
Hyderabad, Telangana:

Huge Python Video Watch Now: ప్రకృతి ఒడిలో సరదాగా గడపాలనుకొని ఆశతో వెళ్లిన పర్యటకులకు చేదు అనుభవం ఏర్పడింది. పచ్చని చెట్ల మధ్యల పారేటి సెలయేటిలో ఎంజాయ్ చేస్తున్న సమయంలో యముడిలా ఓ భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఈ భయానకరమైన దృశ్యాలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. సాధారణంగా ప్రకృతిలో ఇలాంటి ప్రమాదకరమైన పాములు ఉండడానికి సర్వసాధారణం. కానీ జనాల అలికిడి ఉన్న ప్రాంతాల్లోకి ఇలా ఒక్కసారిగా రావడం భయాందోళనకు గురి చేసేలా చేస్తుంది. అయితే, తాజాగా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ముగ్గురు యువకులు దట్టమైన అడవి ప్రాంతంలో ప్రవహిస్తున్న నీటి ప్రవాహం వద్దకి సరదాగా గడిపేందుకు వెళ్లారు. ఒక యువకుడు ఆ నీటిలో ఆనందంతో ఈత కొడుతూ ఉండడం.. మరో యువకుడు ఒడ్డున ఉన్న రాయిపై కూర్చుని ఉండడం మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. అలాగే మూడవ యువకుడు ఒడ్డున నిలబడి నీటిలోకి దూకేందుకు చూస్తూ ఉన్నాడు. చుట్టూ ఉన్న పచ్చదనంతో పాటు స్వచ్ఛమైన నీరు వారిని ఎంతగానో అలరిస్తోంది. అయితే, ఈ ప్రశాంతత ఎంతో సేపు లేకుండా పోయింది.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

అంతా సాఫీగా సాగిపోతున్న క్రమంలో నదికి చాలా దగ్గరగా ఉన్న ఒడ్డున ఉన్న పొదల నుంచి ఓ భారీ కొండచిలువ ఒక్కసారిగా బయటికి రావడం వీడియోలో చూడొచ్చు. ఆ పాము పరిమాణం చూస్తే వెన్నులో వణుకు రావడం ఖాయం.. అయితే, ఆ ఒడ్డున ఉన్న యువకుడిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీనిని ముందుగానే గమనించిన ఆ యువకుడు వెంటనే ఒక్కసారిగా నీటిలో దూకాడు. ఒక నిమిషం పాటు అక్కడ ఏం జరిగిందో అర్థం కాక.. ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని నీటిలో నుంచి వారంతా అవతలి బొడ్డుకి వెళ్లేందుకు ప్రయత్నించారు. 

Also Read: King Cobra Video: ఏంగుండెరా వాడిది.. 20 అడుగుల కింగ్ కోబ్రాతో ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్.. వీడియో మీకోసం..

అంతేకాకుండా దీనిని అంతా గమనించి ముందుగానే ఆ పాముని చూసిన ఒక యువకుడు మాత్రం భయంతో కేకలు వేస్తూ ఒడ్డుకు చేరుకున్నాడు. దీని అందరూ అనుసరించి.. ఆ నీటిలో నుంచి ఒడ్డుకు వెళ్ళిపోయారు.. అయితే, ఆ పాము వారి కేకలు విని వెంటనే పొదల్లోకి వెళ్లిపోయింది. దీంతో ఆ యువకులంతా ఒక్కసారిగా ఊపిరి పెళ్లి చేసుకున్నారు. 12 సెకండ్ల నిడివి గల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోని ఎవరు తీసారో తెలియదు కానీ ఇప్పుడు ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది.. దీనిపై కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇది నిజమైన వీడియో కాదని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సృష్టించిందని అంటున్నారు. అయితే ఇది అసలైన వీడియోను కాదో తెలుసుకోవడానికి తప్పకుండా ప్యాక్ చెక్ చేయాల్సిందే.

Also Read: King Cobra Video: ఏంగుండెరా వాడిది.. 20 అడుగుల కింగ్ కోబ్రాతో ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్.. వీడియో మీకోసం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
BBhoomi
Dec 28, 2025 04:08:37
Secunderabad, Telangana:

Husband Kills Wife: నేటి కాలంలో కుటుంబం గడవాలంటే.. భార్య భర్తలు ఉద్యోగాలు చేస్తే ఆర్థిక ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. అందుకే చాలా మంది మహిళలు.. ఇంటి పనులు చూసుకుంటూ.. ఉద్యోగాలు చేస్తున్నారు. కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. అయితే మహిళలపై జరుగుతున్న ఘటనలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. తాజాగా బెంగళూరులో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన మరోసారి కుటుంబ సంబంధాల్లో పెరుగుతున్న అనుమానాలు, ఆగ్రహం ఎంతటి వినాశనానికి దారి తీస్తుందో.. స్పష్టంగా చూపించింది. భార్య ఉద్యోగంపై అనుమానాలు, విభేదాలు చివరికి హత్యగా మారి.. ఆ కుటుంబాన్ని పూర్తిగా నాశనం  చేసింది. 

అగ్రహార లేఅవుట్‌లో నివసిస్తున్న ఆయేషా సిద్ధిఖీ (39) ఒక మసాజ్ పార్లర్‌లో పనిచేస్తోంది. ఆ ఉద్యోగమే ఆమె జీవితాన్ని బలిగొన్నది. ఆమె భర్త సయ్యద్ జబీకి భార్య మసాజ్ పార్లర్ లో ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. ఇదే విషయం గురించి  దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని పోలీసులు చెబుతున్నారు. ఆయేషా ఉద్యోగం మానేయాలని జబీ పదే పదే ఒత్తిడి చేయడం.. ఆమె మాత్రం కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పని కొనసాగించడం వల్ల వారి మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి. 

మంగళవారం రాత్రి కూడా అదే విషయం మీద ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. మాటలు కాస్తా పెరిగి.. తీవ్ర వాగ్వాదంగా మారాయి. క్షణికావేశానికి లోనైన సయ్యద్ జబీ తనలోని ఆగ్రహాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. ఆ క్షణంలో తీసుకున్న నిర్ణయం భార్యను అంతమొందించింది. కిచెన్‌లో ఉన్న కత్తిని తీసుకుని భార్యపై దాడి చేసి.. ఆమె గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Gold Investment Strategy: ట్రంప్ ఉన్నంత కాలమే ఈ గోల్డ్ రన్ .. ఇప్పుడే చేయాల్సిన స్మార్ట్ మెటల్స్ ప్లాన్ ఇదే.. ఈ సింపుల్ స్ట్రాటజీతో భారీ లాభాలు..!!

భార్యను హతమార్చిన  తర్వాత జబీ అక్కడి నుంచి నేరుగా సంపిగెహళ్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.  నేనే నా భార్యను చంపేశాను  అంటూ పోలీసులకు లొంగిపోవడం అక్కడి సిబ్బందిని కూడా షాక్‌కు గురిచేసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో మృతదేహంగా గుర్తించారు.ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇది కేవలం ఉద్యోగ వివాదమేనా?  లేక ఇతర కారణాలు కూడా ఉన్నాయా ? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆయేషా మృతితో వారి కుటుంబం పూర్తిగా విచ్ఛిన్నమైంది. 

ఇలాంటి సంఘటనలు నేటి సమాజంలో భార్యాభర్తల మధ్య అనుమానాలు, సహనం లోపించడం ఎంత ప్రమాదకరమో గుర్తు చేస్తున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు జీవితాలను, కుటుంబాలను ఎలా నాశనం చేస్తున్నాయో ఈ బెంగళూరు హత్య కేసు ఒక విషాదకర ఉదాహరణగా నిలిచింది.

Also Read:  Copper Price: బంగారం కాదు, వెండి అంతకన్నా కాదు.. మార్కెట్‌లో ఇప్పుడు ఈ లోహమే కింగ్‌..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Dec 28, 2025 03:09:04
Secunderabad, Telangana:

Gold Rate Today: గత కొంతకాలంగా.. బంగారం, వెండి ధరలు రోజుకో కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. వరుసగా 6 రోజులుగా కొనసాగుతున్న ఈ ర్యాలీ శనివారం మరింత వేగం పుంజుకుంది. ఈ నెలలో మాత్రమే బంగారం ధరలు సుమారు 7 శాతం పెరిగితే, వెండి ధరలు ఏకంగా రూ.2.5 లక్షల మార్కును దాటడం మార్కెట్లలో చర్చనీయాంశంగా మారింది.

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం.. ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,220గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,450 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికి వస్తే, ఒక్క రోజులోనే భారీ ఎగబాకి కిలో వెండి ధర దాదాపు రూ.11 వేల పెరుగుదలతో రూ.2,51,000కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లలోనూ పసిడి, వెండి ధరలు ఆల్‌టైమ్ రికార్డులను నమోదు చేశాయి. స్పాట్ గోల్డ్ ధర ఒక్కరోజులోనే సుమారు 1.2 శాతం పెరిగి 4,549 డాలర్లను తాకింది. ఇదే సమయంలో వెండి ధర దాదాపు 9 శాతం పెరిగి ఒక ఔన్స్‌కు 78.65 డాలర్ల స్థాయికి చేరింది. సరఫరా లోటు, పెరుగుతున్న పారిశ్రామిక అవసరాలే వెండి ధరలకు ప్రధానంగా ఊతమిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

1979 తర్వాత ఒకే సంవత్సరంలో బంగారం ఇంత స్థాయిలో లాభాలను ఇవ్వడం ఇదే తొలిసారి అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అసలు బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అనే ప్రశ్నకు పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు పెరగడం ప్రధాన కారణంగా మారింది. 2026లో రెండు సార్లు వడ్డీ రేట్ల కోత ఉండొచ్చన్న అంచనాలు ఇప్పటికే మార్కెట్లో బలంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఈ నెలలోనే ఫెడ్ 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గించింది. వడ్డీ రేట్లు తగ్గితే ట్రెజరీ బాండ్లపై రాబడులు తగ్గిపోతాయి. అప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన బంగారం వంటి ఆస్తుల వైపు మొగ్గు చూపుతారు.

ఇక అంతర్జాతీయంగా డాలర్ విలువ బలహీనపడటం కూడా బంగారం ధరల పెరుగుదలకు మరో ప్రధాన కారణం. డాలర్ బలహీనంగా ఉన్నప్పుడు బంగారం విలువ పెరగడం సహజం. ఇది అమెరికా ఆర్థిక పరిస్థితులపై అనిశ్చితిని సూచిస్తుండటంతో, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షిత మార్గాల్లోకి మళ్లిస్తున్నారు.

Also Read: Jayshree Ullal: టెక్ దిగ్గజాలను పక్కకు నెట్టి..రిచ్ లిస్టులో ఫస్ట్ ప్లేసులో నిలిచిన జయశ్రీ ఉల్లాల్..ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

దీనికితోడు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు కూడా లోహాల ధరలకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్–రష్యా మధ్య మళ్లీ చెలరేగుతున్న ఉద్రిక్తతలు, క్షిపణి దాడులు, ఆఫ్రికాలో అమెరికా చేపట్టిన వైమానిక చర్యలు వంటి పరిణామాలు బంగారం, వెండి వంటి సేఫ్ హావెన్ ఆస్తులపై డిమాండ్‌ను పెంచుతున్నాయి.వెండి ధరల పెరుగుదల వెనుక కూడా బలమైన కారణాలున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో అంటే 2025 జనవరి 1న కిలో వెండి ధర కేవలం రూ.80,000 మాత్రమే. కానీ ప్రస్తుతం అదే వెండి ధర రూ.2.5 లక్షల స్థాయికి చేరింది. అంటే ఒక్క ఏడాదిలోనే దాదాపు 167 శాతం పెరుగుదల నమోదైంది. అంతర్జాతీయంగా వెండి ధర ఒక ఔన్స్‌కు 77 డాలర్లను దాటింది.

వెండి సరఫరాలో లోటు ఉండటం, అమెరికా ఇటీవల వెండిని ‘క్రిటికల్ మినరల్’గా గుర్తించడం వల్ల పారిశ్రామిక డిమాండ్ భారీగా పెరగడం ఈ ర్యాలీకి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. దీనికితోడు పెట్టుబడిదారుల ఆసక్తి కూడా వెండిపై మరింత పెరిగింది. నిజానికి 2026లో వెండి ధర ఒక ఔన్స్‌కు 70 డాలర్లకు చేరుతుందని గతంలో అంచనా వేశారు. కానీ 2026 ప్రారంభం కాకముందే ఆ అంచనాలను దాటేయడం మార్కెట్లను ఆశ్చర్యపరుస్తోంది. జానర్ మెటల్స్‌కు చెందిన ప్రముఖ విశ్లేషకుడు పీటర్ గ్రాంట్ సిఎన్‌బీసీకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, వెండి ధర త్వరలోనే 80 డాలర్ల లక్ష్యాన్ని కూడా తాకే అవకాశం ఉందని అంచనా వేశారు.

Also Read: D-Mart Shopping: సీలు చేసిన పాల ప్యాకెట్‌లో పురుగులు.. డీమార్ట్‌లో షాపింగ్ చేస్తున్నారా? ఇది చదివితే చమటలు పడతాయ్..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
BBhoomi
Dec 27, 2025 12:52:21
Secunderabad, Telangana:

US-Taiwan Arms Deal Fallout: అమెరికాకు దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చింది చైనా. భారీ మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా ఉండూ అంటూ హెచ్చరికలు జారీ చేసింది. చైనా ఆగ్రహానికి కారణం..తైవాన్ కు అమెరికా ఆయుధాలను విక్రయించడం సహించలేకపోయింది. 20 అమెరికా రక్షణ కంపెనీలు.. 10 మంది సీనియర్ అధికారులపై చైనా ఆంక్షలు విధించింది. ఇది వన్  చైనా సూత్రానికి విరుద్ధమని.. తైవాన్ అంశం  చైనా అమెరికా సంబంధాల్లో రెడ్ లైన్ అంటూ బీజింగ్ హెచ్చరికలు జారీ చేసింది. 

తైవాన్‌కు అమెరికా భారీ స్థాయిలో ఆయుధాలు విక్రయించడంపై చైనా తీవ్రంగా స్పందించింది. ఈ ఆయుధ ఒప్పందాన్ని తన సార్వభౌమత్వానికి.. జాతీయ భద్రతకు నేరుగా సవాల్‌గా భావించిన బీజింగ్.. అమెరికా రక్షణ రంగానికి చెందిన కంపెనీలు,  సీనియర్ అధికారులపై కఠిన ఆంక్షలు ప్రకటించింది. ఈ చర్యలు వెంటనే అమల్లోకి వస్తాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

చైనా ప్రకటన ప్రకారం.. మొత్తం 20 అమెరికా రక్షణ కంపెనీలపై ఆంక్షలు విధించింది. వీటిలో నార్త్‌రోప్ గ్రుమ్మన్, బోయింగ్‌కు చెందిన విభాగాలు, L3హారిస్ మారిటైమ్ సర్వీసెస్, VSE కార్పొరేషన్, రెడ్ క్యాట్ హోల్డింగ్స్, టీల్ డ్రోన్స్, రీకాన్‌క్రాఫ్ట్, డెడ్రోన్ హోల్డింగ్స్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. ఈ కంపెనీలకు చెందిన చైనా లోపల ఉన్న చరాస్తులు, స్థిర ఆస్తులన్నింటినీ స్తంభింపజేశారు. ఇకపై చైనా కంపెనీలు లేదా వ్యక్తులు ఈ సంస్థలతో వ్యాపారం చేయడం.. ఒప్పందాలు కుదుర్చుకోవడం పూర్తిగా నిషేధమని పేర్కొంది.

అదేవిధంగా.. 10 మంది అమెరికా సీనియర్ అధికారులపై కూడా చైనా నిషేధాలు విధించింది. ఇందులో అందూరిల్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు పామర్ లక్కీతో పాటు.. L3Harris,  VSE కార్పొరేషన్ వంటి సంస్థల కీలక నిర్వాహకులు ఉన్నారు. వీరిపై చైనాలో ప్రవేశ నిషేధం ఉండటమే కాకుండా.. వారి వ్యాపార కార్యకలాపాలపై కూడా కఠిన పర్యవేక్షణ ఉంటుందని చైనా తెలిపింది.

అసలు చైనా ఎందుకు ఇంత తీవ్రంగా స్పందించింది? దీని వెనకున్న కారణం ఏంటి? అంటే.. దీనికి కేంద్రబిందువే తైవాన్. చైనా తైవాన్‌ను తన భూభాగంలో భాగంగానే చూస్తోంది.  వన్-చైనా సూత్రం  ప్రకారం.. ప్రపంచంలో ఒకే చైనా ఉందని.. తైవాన్ కూడా దానిలో భాగమేనని బీజింగ్ అభిప్రాయం పడుతోంది. ఈ నేపథ్యంలో.. అమెరికా తైవాన్‌కు ఆయుధాలు సరఫరా చేయడం చైనా–అమెరికా మధ్య కుదిరిన మూడు సంయుక్త ఒప్పందాలకు (జాయింట్ కమ్యూనిక్స్) విరుద్ధమని చైనా వాదిస్తోంది.

Also Read:  China Gen-Z: చైనా Gen-Z విషపూరిత పాములను ఎందుకు కొంటున్నారు? ఈ పైత్యానికి కారణమేంటి..?

చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ.. తైవాన్ అంశం చైనా కోర్ ఇంటరెస్ట్  అని స్పష్టం చేశారు. ఇది చైనా–అమెరికా సంబంధాలలో ఒక రెడ్ లైన్ అని.. ఈ విషయంపై జోక్యం చేసుకునే ఎవరైనా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తైవాన్‌కు ఆయుధాలు అమ్మే కంపెనీలు లేదా వ్యక్తులు తప్పకుండా మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన స్పష్టంగా చెప్పారు.

అమెరికా తైవాన్‌కు ఆయుధాలు పంపడం వల్ల తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరుగుతాయని చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి చర్యలు ప్రాంతీయ శాంతి.. స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని బీజింగ్ అభిప్రాయపడుతోంది. అందుకే, తైవాన్‌కు ఆయుధ సరఫరాను వెంటనే నిలిపివేయాలని, పరిస్థితిని మరింత రెచ్చగొట్టే చర్యలకు దూరంగా ఉండాలని చైనా అమెరికాను కోరింది.

తన సార్వభౌమత్వం, భద్రత,  ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చైనా స్పష్టం చేసింది. అమెరికా–తైవాన్ ఆయుధ ఒప్పందాలపై చైనా తీసుకున్న ఈ కఠిన వైఖరి.. భవిష్యత్తులో ఈ మూడు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాన్ని సూచిస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు.

Also Read: Jayshree Ullal: టెక్ దిగ్గజాలను పక్కకు నెట్టి..రిచ్ లిస్టులో ఫస్ట్ ప్లేసులో నిలిచిన జయశ్రీ ఉల్లాల్..ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
BBhoomi
Dec 27, 2025 12:22:19
Secunderabad, Telangana:

America Warns India: భారత్, చైనా మధ్య అరుణాచల్ ప్రదేశ్ కు సంబంధించిన వివాదం నడుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని చైనా వాదిస్తోంది. కాదు.. కాదు.. అరుణాచల్ ప్రదేశ్.. అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ భారత భూభాగమే అని విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. అయితే చైనా ..ఈ విషయంలో తరచుగా భారత్ ను కెలికే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ తరుణంలోనే ఈ అంశానికి సంబంధించి చైనా నుంచి భారత్ కు  ప్రమాదం పొంచి ఉందని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది. 

అగ్రరాజ్యం అమెరికా తాజాగా విడుదల చేసిన ఓ కీలక రిపోర్టులో భారత్ కు హెచ్చరిక జారీ చేసింది. చైనా, అరుణాచల్ ప్రదేశ్ ను తైవాన్ స్థాయిలోనే అత్యంత కీలకమైన ప్రాంతంగా భావిస్తుందని.. రానున్న కాలంలో ఇదే అంశం భారత్, చైనా మధ్య  యుద్ధానికి కారణం కావచ్చని  యూఎస్ పెంటగాన్ తన నివేదికలో పేర్కొంది. ఈ రిపోర్టు ప్రకారం.. చైనా తన దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే తైవాన్, దక్షిణ చైనా సముద్రం, అరుణాచల్ ప్రదేశ్ ను ఒకే సరసన పెట్టి చూస్తోంది. అయితే పెంటగాన్ అంచనాల ప్రకారం.. 2019 నాటికి గ్రేట్ నేషనల్ రిజువనేషన్ అనే లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పంతో చైనా ఉంది. ఆ లక్ష్యంలో భాగంగానే..ప్రపంచంలోనే ప్రధాన శక్తిగా ఎదగడంతోపాటు.. అవసరమైతే యుద్ధాలను గెలిచే శక్తివంతమైన సైన్యాన్ని నిర్మించడంపై బీజింగ్ ఫోకస్ పెట్టింది.ఈ క్రమంలోనే.. సరిహద్దు వివాదాలు ఉన్న ప్రాంతాలను చైనా తన  కోర్ ఇంటరెస్ట్స్ గా ప్రకటిస్తూ.. వాటిపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ కూడా అందులో ఒకటిగా ఉందని అమెరికా నివేదిక స్పష్టం చేసింది.

అరుణాచల్ ప్రదేశ్ భారత భాగమేనని.. గతంలోనూ.. ఇప్పుడూ..  భవిష్యత్తులోనూ అలాగే ఉంటుందని భారత్ పదేపదే ప్రకటిస్తోంది. అయితే చైనా మాత్రం దీన్ని పెడచెవిన పెడుతోంది.  1914లో బ్రిటిష్ ఇండియా,  టిబెట్ మధ్య కుదిరిన మెక్‌మహాన్ లైన్‌ను చైనా అధికారికంగా ఒప్పుకోలేదు. అందుకే అరుణాచల్ ప్రదేశ్‌ను  దక్షిణ టిబెట్  లేదా  జాంగ్నాన్  అని పిలుస్తోంది. మొదట్లో ఈ వాదన తవాంగ్ ప్రాంతానికే పరిమితమై ఉంది. కానీ.. క్రమంగా మొత్తం అరుణాచల్ ప్రదేశ్‌ను తనదిగా పేర్కొనే స్థాయికి చైనా వెళ్లిందని నివేదిక చెబుతోంది.చైనా తరచూ అరుణాచల్ ప్రదేశ్‌లోని గ్రామాలు, పట్టణాలకు కొత్త పేర్లు పెట్టి ప్రకటించడం కూడా ఈ ఒత్తిడి వ్యూహంలో భాగమేనని అమెరికా అభిప్రాయపడుతోంది. ఇది కేవలం మాటల యుద్ధం మాత్రమే కాదు.. భవిష్యత్తులో సరిహద్దు వద్ద ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని నివేదిక హెచ్చరిస్తోంది.

Also Read: Jayshree Ullal: టెక్ దిగ్గజాలను పక్కకు నెట్టి..రిచ్ లిస్టులో ఫస్ట్ ప్లేసులో నిలిచిన జయశ్రీ ఉల్లాల్..ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు కూడా ఈ వివాద తీవ్రతను చూపిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన భారత పౌరురాలు ప్రేమా థాంగ్‌డోక్‌ను షాంఘై విమానాశ్రయంలో దాదాపు 18 గంటల పాటు నిర్బంధించారు. ఆమె పాస్‌పోర్ట్‌లో జన్మస్థలంగా అరుణాచల్ ప్రదేశ్, ఇండియా అని ఉండటమే దీనికి కారణం. ఆ సమయంలో ఆమెకు ఆహారం, ఇతర సౌకర్యాలు కూడా కల్పించలేదని సమాచారం. భారత కాన్సులేట్ జోక్యం చేసుకున్న తర్వాత మాత్రమే ఆమెను విడుదల చేశారు. అలాగే.. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో భాగమని చెప్పిన ఒక యూట్యూబర్‌ను కూడా చైనా అధికారులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది.

ఈ మొత్తం వ్యూహంలో పాకిస్తాన్ పాత్ర కూడా ఉందని అమెరికా నివేదిక పేర్కొంది. భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు చైనా పాకిస్తాన్‌ను ఒక సాధనంగా ఉపయోగిస్తోందని..  సరిహద్దులో శాంతి పేరుతో ఒకవైపు, పాకిస్తాన్ ద్వారా మరోవైపు ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందని అంచనా వేసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ చైనా తయారీ ఆయుధాలను ఉపయోగించిందన్న అంశాన్ని కూడా నివేదిక ప్రస్తావించింది.

మొత్తంగా.. అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా చేస్తున్న దావాలు కేవలం భూభాగ వివాదం మాత్రమే కాదని.. అది చైనా ప్రపంచ వ్యూహంలో భాగమని అమెరికా స్పష్టం చేస్తోంది. ఇదే కారణంగా.. రాబోయే కాలంలో అరుణాచల్ ప్రదేశ్ భారత్–చైనా మధ్య పెద్ద ఘర్షణకు కేంద్ర బిందువుగా మారే ప్రమాదం ఉందని ఈ నివేదిక హెచ్చరిస్తోంది.

Also Read:  China Gen-Z: చైనా Gen-Z విషపూరిత పాములను ఎందుకు కొంటున్నారు? ఈ పైత్యానికి కారణమేంటి..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
Advertisement
Back to top